ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, రుద్రకోడూరు చెంచుగూడెంకు చెందిన ఒక చెంచు గిరిజన కుటుంబం ఆధార్ కార్డులు లేక, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతమని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రుద్రకోడూరు చెంచుగూడెంలో పర్యటించి స్థానిక చెంచు గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నాయక్ మాట్లాడుతూ రుద్రకోడూరు చెంచుగూడెంకు చెందిన గుళ్ళ ఈదమ్మ, ఆమె కుటుంబ సభ్యులు గుళ్ళ వెంకటేష్, గుళ్ళ మూగెమ్మ, గుళ్ళ తాండ్రిటి, దాసరి అంకమ్మలు 2007వ సంవత్సరంలో జీవనోపాధి కోసం గుంటూరు జిల్లా వెల్దూర్తి మండలంలోని గంగిరెడ్డి కుంట చెంచు కాలనీకి వలస వెళ్లారని తెలిపారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు జీవనం కొనసాగించిన తరుణంలో, ప్రమాదవశాత్తు వారి గుడిసె కాలిపోయిందని, ఆ మంటల్లోనే వారికి సర్వస్వమైన ఆధార్ కార్డులు కూడా బూడిదయ్యాయని పేర్కొన్నారు. తిరిగి 2014వ సంవత్సరం నుంచి వారు రుద్రకోడూరు చెంచుగూడెంలోనే నివాసం ఉంటున్నప్పటికీ నిరక్షరాస్యత, అవగాహన లోపం వల్ల తిరిగి ఆధార్ కార్డులు చేయించుకోలేకపోయారని నొక్కి చెప్పారు. ఫలితంగా వీరికి ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదని, పొట్టకూటి కోసం శ్రీశైలం క్షేత్రం భక్తుల వద్ద, కాలినడకన వెళ్లే భక్తుల వద్ద బిచ్చమెత్తుకొని దీనంగా జీవిస్తున్నామని ఆ బాధితులు కన్నీరు మున్నీరయ్యారని జవహర్ నాయక్ వివరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడచినా, అడవి బిడ్డలకు మాత్రం ఇంకా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సంబందించిన ఐటీడీఏ అధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, నల్లమల అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దీనస్థితిలో గడుపుతున్న చెంచు గిరిజనుల పరిస్థితులపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డులు లేని వారికి వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే సదరు నిరుపేద గిరిజన కుటుంబాలకు సొంత గృహాలు నిర్మించి, జీవనోపాధి కల్పించేలా ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకోవాలని, అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చెంచు గిరిజనుల సమస్యలు గుర్తించి, పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు.
Admin
E Nivas News