ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్ టి ఆర్ జిల్లా/రెడ్డిగూడెం : వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు 'డబుల్ ధమాకా' లాంటి మేలు జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు ఆర్డీవో కె.మాధురితో కలిసి రెడ్డిగూడెం మండలంలోని, రంగాపురం గ్రామంలో పర్యటించి, మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీవో) అభ్యుదయ రైతులతో మాట్లాడి ఫ్రూట్ కవర్ల వినియోగం, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మామిడి కాయలకు ఫ్రూట్ కవర్లు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ మామిడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఉద్యాన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ్రూట్ కవర్లు వల్ల ఎలాంటి మచ్చ లేని, మంచి రంగుతో పరిమాణంలో మామిడి దిగుబడి ఉంటుందన్నారు. హెక్టారుకు 15 వేల కవర్లను 50 శాతం రాయితీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఇలాంటి మామిడికి మార్కెట్లో మంచి రేటు ఉంటుందని, వినియోగదారులకు కూడా మంచి నాణ్యమైన ఆరోగ్యకర పండ్లు లభిస్తాయన్నారు. నిమ్మకాయ సైజులో కాయ ఉన్నప్పుడు కవర్ కట్టడం వల్ల పండ్ల ఈగలు, ఇతర కీటకాలు కాయను ఆశించలేవని.. దీనివల్ల రైతుకు పురుగుమందుల ఖర్చు బాగా తగ్గుతుందని, రసాయన అవశేషాలు లేని పండ్లు ఉత్పత్తి అవుతాయని వివరించారు. మామిడి రైతులు కూడా 100 శాతం ప్రకృతి సేద్య విధానాలను అనుసరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం కృషితో ప్రభుత్వం మామిడి సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మామిడి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. మామిడి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న కోడి పేనుపై దృష్టిసారిస్తున్నామని, శాస్త్రవేత్తల సహకారంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News