ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొత్తపల్లిలోని, మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు, రైతు సాధికార సంస్థ, సెర్ప్–వెలుగు సంస్థల సమన్వయంతో మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్ పుల్లయ్య పాల్గొని మాట్లాడుతూ, ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ అంశాన్ని అజెండాగా తీసుకుని చర్చించాలని సూచించారు. చిన్న రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో పెరటి తోటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ ఎం ఎన్ ఎఫ్)గా జాతీయ స్థాయిలో అమలు చేయడం సంతోషకరమని, ప్రతి ఒక్కరు తప్పకుండా తమకు ఉన్న పొలంలో కనీసం ఒక 50 సెంట్లు ఐనా ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డీపీఎం సలాం మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్పై అవగాహన కల్పించి, మండలంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, కొత్తగా ఎంపికైన ఎన్ ఎం ఎన్ ఎఫ్ గ్రామాల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అలాగే మండల సమాఖ్య స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కమిటీగా ముగ్గురు సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ తరఫున మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం–రసాయనిక వ్యవసాయం మధ్య ఉన్న తేడాలను వివరించి, యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. అలాగే ప్రతి రైతు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని, అలాగే పంటల మార్పిడి ఉండాలని ఒకే పంట ప్రతిసారీ వేస్తే దిగుబడి తగ్గుతుంది అని రైతులు వినూత్న పంటల సాగు అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ఎస్ ఆర్ పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఒకే పంట సాగు చేయటం వల్ల కలిగే నష్టాలు పలు పంటల సాగు వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న వివిధ పంటల గురించి వివరించారు. పలు పంటల సాగులో మిల్లెట్ సాగు చేయాలని రైతులను కోరడం జరిగింది. మోడల్ మేకర్ సయ్యద్ భాష మరియు మహబూబ్ భాష లు ఎన్ఏంఎన్ఎఫ్ ద్వారా గ్రామంలో జరుగుతున్న మరియు చేపట్టబోయే కార్యక్రమాలు, కిచెన్ గార్డెన్ సాగు గురించి మరియు ప్రకృతి వ్యవసాయ చేయటం వల్ల రసాయన రహిత ఆహారం వస్తుంది అని ప్రకృతి వ్యవసాయ పంటలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం అబ్దుల్ సలాం, సెర్ప్ ఏసీ పుల్లయ్య, వ్యవసాయ అధికారి అమీరున్నిసా బేగం , ఎస్ఆర్పి నరేంద్ర గౌడ్,ఏం టి మహబూబ్ భాష, మోడల్ మేకర్ సయ్యద్ భాషా, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు సరస్వతి, రాజు నాయక్, చిన్న స్వామి నాయక్, ఏఈఓ నాగశ్రీ, ఎంపీవోలు, వెలుగు సీసీలు, వివోఏలు, ఐసీఆర్పీలు, మండల సమాఖ్య మహిళా సభ్యులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News