ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో అనుమతిలేని ఇసుక దందాలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె హరిత బుధవారం స్వయంగా రంగంలోకి దిగారు. కొమురం భీం జిల్లాలో అనుమతిలేని ఇసుక నదీ గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా విరుచుకుపడ్డారు. బుధవారం రెబ్బెన మండలం రాంపూర్ శివారులో కలెక్టర్ జరిపిన మెరుపు తనిఖీలో జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగజ్ నగర్ పెద్దవాగును అడ్డాగా చేసుకుని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాంపూర్ గ్రామం సమీపంలో వాగు నుండి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆమె స్వయంగా అడ్డుకున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇసుకను తరలించవచ్చన్న ధీమాతో ఉన్న అక్రమార్కులకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ట్రాక్టర్లను పరిశీలించిన సమయంలో కనీసం అనుమతి పత్రాలు కూడా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే ఆ వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి పర్యావరణాన్ని నాశనం చేసే ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోం అని జిల్లాలోని ప్రతి వాగుపై నిఘా ఉంచాం అన్నారు. ఇకపై తనిఖీలు మరింత ఉధృతం చేస్తాం అని తెలిపారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి నిఘా పెట్టడంతో జిల్లాలోని ఇసుక మాఫియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే కాదు, అక్రమాలను అరికట్టేందుకు రోడ్ల పైకి వస్తామని ఆమె చేతల్లో చూపించడం,అధికారుల అండదండలతో సాగుతున్నాయో లేదా తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు.
Admin
E Nivas News