ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ లో శనివారం ఉదయం 06:00 గంటల నుండి చైర్పర్సన్,వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారంతెలిపారు. ఈ ఆంక్షల కాలంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటుచేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోమ్గార్డులు మరియు ఎస్పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు. చట్టపరమైన అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకో లు, ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, ఎవ్వరు కూడా కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సీపీ తెలిపారు. మైకులు, లౌడ్స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గం మీద మరొక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషేధమని తెలిపారు. 163 బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ అమలు సమయంలో చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించిన పక్షంలో, చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోబడతాయి అని సీపీ తెలిపారు.
Admin
E Nivas News