ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసులో మరింత కఠినమైన సెక్షన్లు చేర్చారు. ఇప్పటికే బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్విత్ 12 కింద కేసు నమోదు కాగా తాజాగా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎల్) రెడ్విత్ 6ను అదనంగా జోడించారు. ఈ కేసులో నేడు విచారణకు హాజరుకావాలని పోలీసులు భగీరథ్కు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన మేనమామ, వైద్యుడు సీహెచ్ వంశీకృష్ణ నివాసానికి పోలీసులు వెళ్లగాఅక్కడ ఆయన లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నోటీసు కాపీని కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. కేసు పర్యవేక్షణాధికారిణిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు వివరాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు అధికారులతో సమావేశమై కేసులో కొత్త సెక్షన్లు చేర్చినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది అక్టోబర్ 25న భగీరథ్ తన కుమార్తెను నానక్రాంగూడలోని ఓ అపార్ట్మెంట్కు తీసుకెళ్లి 2 నుంచి 3 రోజుల పాటు అక్కడే ఉండాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో ఇద్దరు స్నేహితులు కూడా అక్కడ ఉన్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 13న మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో, డిసెంబర్ 31న మరో ఫామ్హౌస్లో కూడా లైంగిక వేధింపులు ఎదురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రీజర్ తాగాలని బలవంతం చేయడం, రాత్రి సమయంలో గదికి వచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనల సమయంలో అక్కడ ఉన్న యువకులు, యువతుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Admin
E Nivas News