ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అవినీతి ఒక దేశం అభివృద్ధికి అడ్డు గొడ్డలిలాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను తగ్గిస్తూ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను నాశనం చేసే శక్తి అవినీతికి ఉంది. చిన్న లంచాల నుండి పెద్ద స్థాయి కుంభకోణాల వరకు, ప్రభుత్వ వ్యవహారాల నుండి వ్యక్తిగత పనుల వరకు అవినీతి ప్రభావం సమాజంలోని ప్రతి రంగంలో కనిపిస్తుంది. అందుకే అవినీతిని అరికట్టడం ఒక అత్యవసర కర్తవ్యంగా మారింది. మొదటిగా అవినీతి నియంత్రణలో కఠినమైన చట్టాలు కీలకం. నేరం నిరూపించడానికి తీసుకునే సమయం ఎక్కువైతే భయం తగ్గిపోతుంది. కాబట్టి అవినీతి కేసులకు ప్రత్యేక కోర్టులు, నిర్దిష్ట కాలపట్టికలు, కఠిన శిక్షలు తప్పనిసరి. "శిక్ష తప్పదు" అనే నమ్మకం పెరిగితే అవినీతి సహజంగానే తగ్గుతుంది. తర్వాత, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత తప్పనిసరి. టెండర్లు, నియామకాలు, కాంట్రాక్టులు, అనుమతులు మొత్తం వ్యవస్థను డిజిటలైజ్ చేస్తే అవినీతి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ సేవలు పెరిగితే మధ్యవర్తులు, బలవంతపు లంచాలు తగ్గుతాయి. ఆర్టీఐ, ఈ-ఆఫీస్, ఈ-ప్రోక్యుర్మెంట్ వంటి పద్ధతులు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. అవినీతి పూర్తిగా అరికట్టాలంటే ప్రజల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. లంచం తీసుకున్నా, ఇచ్చినా అది నేరమే అన్న అవగాహన ప్రజల్లో రావాలి. పౌరులు తమ హక్కులను తెలుసుకుని, ఎక్కడైనా అవినీతి కనిపించినప్పుడు ఫిర్యాదు చేయాలి. విజిల్బ్లోయర్ వ్యవస్థలను బలపరచడం, ఫిర్యాదుదారుల రక్షణ ఇవ్వడం అవసరం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులపై బాధ్యత పెంచడంతో పాటు తరచూ విధుల మార్పులు, పనితీరుపై రేటింగ్, సేవా ప్రమాణాలు విధించడం ద్వారా అవినీతిని కట్టడి చేయవచ్చు. ఒకే స్థానం, ఒకే దఫ్తరులో ఏళ్ల తరబడి పని చేస్తే అవినీతి పెరిగే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ ధోరణిని మార్చాలి. మరొక కీలక అంశం నైతిక విద్య. చిన్నప్పటి నుంచే పిల్లలలో నిజాయితీ, ధర్మం, సమాజ సేవ భావం పెంచితే భవిష్యత్ తరాలు అవినీతిముక్త భారత నిర్మాణానికి దోహదం చేస్తాయి. నైతికత ఉన్న చోట అవినీతి నిలవలేను. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు అత్యవశ్యకం. ఎన్నికల ఖర్చు నియంత్రణ, పార్టీ ఫండింగ్లో పారదర్శకత, శుభ్రమైన నడవడిక కలిగిన అభ్యర్థులకు మాత్రమే అవకాశాలు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే గొప్ప మార్పులు సాధ్యమవుతాయి. శుభ్రమైన రాజకీయాలు ఉంటేనే శుభ్రమైన పరిపాలన వస్తుంది. మొత్తం మీద అవినీతి భరతం పట్టడం ఒక్కరోజు జరిగే పని కాదు. కానీ ప్రభుత్వం, పౌరులు, మీడియా, న్యాయ వ్యవస్థ అందరూ కలిసి పనిచేస్తే అవినీతి భారీగా తగ్గుతుంది. నైతిక విలువలు ఉన్న సమాజం, పారదర్శక పరిపాలన ఉన్న దేశం ఇవి అవినీతిని అరికట్టే రెండు ప్రధాన ఆయుధాలు.ప్రతి పౌరుడు "లంచం ఇవ్వను, తీసుకోను" అనే నిశ్చయంతో ముందుకు వస్తే అవినీతి నిర్మూలన ఖచ్చితంగా సాధ్యమే. --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News