ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి. ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ నియామకం జరిగే అవకాశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1992 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరు. ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి 1994 బ్యాచ్కు చెందిన అధికారి కావడంతో సీనియారిటీ పరంగా ఆనంద్కు ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపినట్టు సమాచారం. ఈ జాబితాలో 1994 బ్యాచ్కు చెందిన సౌమ్య మిశ్రా , వినయ్ కుమార్ ఆప్టే మరియు 1995 బ్యాచ్కు చెందిన Shikha Goel పేర్లు కూడా ఉన్నాయి. అయితే వీరిలో అందరి కన్నా సీనియర్గా, సమర్థుడిగా గుర్తింపు పొందిన సీవీ ఆనంద్కే ప్రభుత్వం డీజీపీ పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సీఎస్గా మరికొంత కాలం రామకృష్ణారావుకే చాన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా ఉన్న కే. రామకృష్ణారావు ఉద్యోగకాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. గత ఏడాది ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల పాటు సర్వీస్ ఎక్స్టెన్షన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో జనగణన, “సర్” అమలు వంటి కీలక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డినేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం. గతంలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీఎస్లకు ఏడాది వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నందున రామకృష్ణారావుకు కనీసం మూడు నెలల పాటు మరింత పొడిగింపు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్టెన్షన్ లేకపోతే జయేశ్ రంజన్కు అవకాశం..ఒకవేళ రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే తదుపరి సీఎస్గా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు అదే బ్యాచ్కు చెందిన వికాస్ రాజ్, సంజయ్ జాజు పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.అదే సమయంలో 1994 బ్యాచ్కు చెందిన సభ్యసాచి ఘోష్ కూడా సీఎస్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో సీనియారిటీ పరంగా 1991 బ్యాచ్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆయనపై ఆసక్తి లేదని సమాచారం. ఆయనపై ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో సీఎస్ పదవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రామకృష్ణారావుకు ఎక్స్టెన్షన్ ఇవ్వని పరిస్థితిలో జయేశ్ రంజన్ తదుపరి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
Admin
E Nivas News