ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం సిపి సందర్శించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు భయభ్రాంతి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించడానికి పోలింగ్ రోజు ఎలాంటి అక్రమాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు భయభ్రాంతులు లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛ గా వినియోగించుకునేలా పోలీస్ తరుపున అన్ని భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చట్టవ్యతిరేక చర్యలు ఎవరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. స్థానిక ప్రజలకు, అన్ని పార్టీల కార్యకర్తలకు శాంతి భద్రతలు, చట్టపరమైన నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, మంథని సిఐ బి రాజు , మంథని ఎస్ ఐ రమేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News