ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వేసవి సెలవులుముగియడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈసారి బడిగంట మోగనున్న తొలి రోజు అమావాస్య కావడం చర్చనీయాంశంగా మారింది. అమావాస్య రోజున పిల్లలను పాఠశాలకు పంపడం మంచిది కాదనే అభిప్రాయంతో పలువురు తల్లిదండ్రులు తొలిరోజు పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ, అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంగళవారం లేదా బుధవారం నుంచి మాత్రమే పంపించాలని భావిస్తున్నారు. కొందరు మంగళవారం కూడా కొత్త కార్యక్రమాలకు అనుకూలం కాదనే నమ్మకంతో నేరుగా బుధవారానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలలు అదే బాటలో.. అమావాస్య నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యార్థుల హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి నేరుగా జూన్ 17 నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపుతున్నాయి. శుక్రవారమే పిల్లలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలు తెరవాల్సిన రోజునే తమ పిల్లలను కొద్దిసేపు స్కూల్కు తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అమావాస్య ప్రభావం ఈసారి విద్యారంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నారని అనడంలో సందేహం లేదని విషయం తేట తెల్లమైంది.
Admin
E Nivas News