ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అంగన్వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు అని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం హైదరాబాద్ జిల్లా మల్లేపల్లిలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్వాడీ బాట" కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి ఆమె చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, నూతన యూనిఫాంలు, ఆటవస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 38 వేల అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా, నాణ్యమైన విద్యనందించే తొలి విద్యాలయాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. చిన్నారుల కోసం ప్రతి ఒక్కరికీ రెండు జతల యూనిఫాంలు, 57 రకాల విద్యా-ఆట వస్తువులను అందిస్తున్నాం. నర్సరీ పూర్తి చేసిన వారికి ప్రత్యేక సర్టిఫికెట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 9 లక్షల మంది చిన్నారులకు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నాం. భద్రాద్రి, ఆదిలాబాద్లలో విజయవంతమైన 'బ్రేక్ఫాస్ట్ పథకాన్ని' రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. అంగన్వాడీ టీచర్లకు ఇంగ్లీష్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రైవేట్ నర్సరీలకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నైపుణ్యమున్న టీచర్లు గల అంగన్వాడీల్లోనే పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. అనంతరం మంత్రి సీతక్క "ప్రైవేట్ నర్సరీ వద్దు,అంగన్వాడీ ముద్దు"అనే నినాదంతో సాగిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News