ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కేంద్రంలోని ఓల్డ్ సిటీ 27వ వార్డు మిర్యాలగూడ రోడ్డు 22 వార్డ్,గొల్లగూడ 20 వార్డులో గల పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతాపరంగా పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుంపులపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లను సక్రమంగా నిర్వహిస్తూ, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సౌకర్యమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం లోపల మరియు బయట తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణనిర్వహించడం, వాహనాల రాకపోకలను నియంత్రించడం, అనవసర వ్యక్తుల ప్రవేశాన్ని కట్టడి చేయడం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బి సీఐ రాము, టుటౌన్ సీఐ రాఘవ రావు, నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News