ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. సోమవారం ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాలలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, బారికేడింగ్, పోలీస్ పికెట్లు, పార్కింగ్ సదుపాయాలు, మీడియా గది తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, ప్రత్యేక నిఘా బృందాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు. 750 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా బందోబస్తు... మహబూబాబాద్ జిల్లాలోని (మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం,మరిపెడ, తొర్రుర్ )ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 750 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. మొత్తంగా 5 గురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 27 మంది ఎస్ఐలు, 96 మంది ఏఎస్ఐ హెచ్సీలు, 543 మంది పీసీ, హోమ్గార్డులు, 63 మంది మహిళా సిబ్బందితో కలిపి 750 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కేసులో చిక్కుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అన్ని శాఖలతో సమన్వయంగా పని చేసి మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు.
Admin
E Nivas News