ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పార్టీలో ఏవైనా, ప్రజల పక్షాన, ప్రజా అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి బోథ్ నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో మంజూరు అయిన విద్యుత్ సబ్ స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. బోథ్ మండలంలోని ధన్నుర్ బి గ్రామంలో, నెరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లు కావాలని పలు మార్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రులను, అధికారులను కలిసి విన్నవించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉట్నూర్ మండలంలోని పెర్కాగుడా గ్రామానికి విచ్చేసినప్పుడు సైతం వినతిపత్రం అందజేయగా ఎట్టకేలకు బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలంలో ధన్నుర్ బి, నెరడిగొండ మండలంలోని కుప్టి కుమారి, తలమడుగు మండలంలోని కుచులపూర్ లో నూతనంగా 3 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తానని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన ప్రజా సమస్యలకై అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి వైపే వెళ్తానని తెలిపారు. ఇట్టి సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
Admin
E Nivas News