ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి : మంథని ముత్తారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు సమయానికి నాణ్యతతో పూర్తి కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముత్తారం మండలం దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను, మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులు సమయానికి, నాణ్యతతో పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల పురోగతి పై సమగ్రంగా ఆరా తీసి, ఇప్పటికే ఆమోదించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరమైతే వెంటనే అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని, అంచనాలు అందిన వెంటనే అవసరమైన అదనపు నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని అయ్యగారి చెరువు రీ-మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి చెరువు పునర్నిర్మాణ పనులను వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనుల్లో కనీసం 50 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News