ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలోవిద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదుల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు చేపట్టి విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా పోషక విలువలతో కూడిన మెనూ అమలు చేస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మైనింగ్ ఎ.డి. జగన్మోహన్ రావు, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్ర, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ఆన్ లైన్ లో మన ఇసుక వాహనం వెబ్ సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకున్న వినియోగదారులకు తక్కువ ధరకు అధికారికంగా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వానికి పన్ను నష్టం జరుగుతుందని, సరైన విధంగా ఇసుకను అందించి ప్రభుత్వం పొందే పన్ను ద్వారా మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లలో జిపిఎస్, డ్రోన్, సాటిలైట్ల ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా వ్యవస్థను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వినియోగదారులకు సకాలంలో ఇసుకను తక్కువ ధరకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీ ఇతర పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి మండలాల వారీగా ఆన్ లైన్ మన ఇసుక వాహనం బుకింగ్ ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ముల్కల్ల ఇసుక రీచ్ నుండి మందమర్రి, క్యాతనపల్లి, ఇందారం ఇసుక రీచ్ నుండి జైపూర్, భీమారం, కొల్లూర్ ఇసుక రీచ్ నుండి కోటపల్లి, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాలకు నిబంధనల ప్రకారం ఇసుక అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్లు రైతు పొలాల నుండి వెళ్ళినట్లయితే సంబంధిత రైతుకు నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేయడంతో స్థానిక ట్రాక్టర్ నిర్వాహకులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మొదటిసారి జరిమానా, 2వ సారి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చెన్నూర్ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో 80లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను రాయితీ క్రింద రైతులకు అందజేశారు. మండలంలోని కన్నెపల్లి, లంబాడిపల్లి ఐ.కె.పి. సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీకిలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ చెన్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీకృత కూరగాయల మార్కెట్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News