ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సంగారెడ్డిజిల్లాలో ఏ తప్పు చేయని మహిళపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమె భర్త చేసిన తప్పుకు మహిళను తీవ్రంగా హింసించారు. ఆ మహిళ భర్త ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. చివరికి తీవ్రంగా గాయపడిన ఆ మహిళ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతు న్నారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన వసంత కుమారి, రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. అయితే వసంత కుమారి, భర్త ప్రభాకర్ హెచ్బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామస్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. రాసోల్ గ్రామానికి చెందిన చాకలి బాలమణి, అవుటి సాయ వ్వ, అవుటి బండ్యప్ప, భూతాలే వైద్యనాథ్, కోటగిరి రాములు అనే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. దీంతో భర్త మీద కోపంతో తమ గ్రామంలో అంగన్వాడీ విధులకు వచ్చిన వసంతకుమారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతేకాకుండా జుట్టు కత్తిరించి గాడిదపై ఊరంతా ఉరేగిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనను కొట్టొద్దని వసంత కుమారి ఎంత వేడుకున్నా కనీసం కనికరించని గ్రామస్తులు ఆమెపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి ఆమెను గంటకు పైగా తీవ్ర చిత్ర హింసలకు గురిచేశారు. వసంత కుమారి,భర్త గ్రామంలోని పలువురు వద్ద నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఇక ఆమె భర్తపై ఉన్న కోపంతో దీనితో ఎలాంటి సంబంధం లేని వసంత కుమారిపై గ్రామస్తులు విచక్షణారహి తంగా దాడికి పాల్పడ్డారు. చివరికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని మాట్లాడటంతో వసంత కుమారిని విడిపించారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కాస్తా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావ డంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చేయని తప్పుకు ఆ మహిళను చిత్రహింసలకు గురి చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె భర్త తప్పు చేస్తే అతడికి శిక్ష విధించాలి గానీ మహిళను ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తు న్నారు.
Admin
E Nivas News