ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు అయ్యప్ప స్వామి శోభ యాత్రను మంథని పుర వీధుల గుండా వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ఉదయం అరట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంథని గోదావరి నది తీరంలో ఉదయం స్వామి ఉత్సవ విగ్రహానికి దీక్ష పరులంతా చక్ర స్నానాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఆనంతరం ట్రాక్టర్పై ప్రత్యేకంగా ఆలంకరించిన మండపంలో వివిధ రకాల పూలతో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఎరుకలగూడెం, బస్టాండ్, అంబేద్కర్క్,గాంధీక్, పెంజేరుకట్టల మీదుగా ఆలయం వరకు స్వామి శోభయాత్రను దీక్షా పరులు, భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పాటలకు దీక్షా పరులు ఆనందోత్సవాల మధ్య భజనలు చేస్తూ స్వామిని స్మరిస్తూ పాటలు పాడారు. శోభయాత్రలో వెళ్తున్న స్వామి వారిని భక్తులు దర్శించుకోవడంతో పాటు కానుకలు, హారతులిస్తూ, కొబ్బరి కాయలు కొడుతూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శోభయమానంగా జరిగిన స్వామి వారి ఊరేగింపులో పూజారులు నాగేంద్రశర్మ, భద్రయ్య, దీక్షా పరులు వొడ్నాల శ్రీనివాస్, ఎంఎస్.రెడ్డి, కంది కృష్ణారెడ్డి, మిట్ట చంద్రయ్యలతో పాటు పలువురు దీక్షా పరులు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News