ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యంను కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . గురువారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల తహసిల్దార్లు పుష్పలత, దిలీప్ కుమార్ లతో కలిసి రాజరాజేశ్వర రైస్ మిల్ ను సందర్శించి ప్రక్రియ పరిశీలించిన అనంతరం గాయత్రి రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన గోదామును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి ధాన్యం తప్పనిసరిగా నిబంధనల ప్రకారం శుభ్రపరచి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో లారీలు, హమాలీల కొరత, సమస్య లేకుండా ధాన్యం దిగుమతి త్వరగా పూర్తిచేసే విధంగా రైస్ మిల్లులు, లారీల యజమానులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, గోదామును దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News