ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో రైతాంగం ప్రస్తుతం విత్తనాలు నాటుతున్న నేపథ్యంలో నకిలీ, నాణ్యతలేని, నిషేధిత విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులను మోసగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ఇప్పటివరకు సుమారు 220 మంది ఎరువులు, విత్తనాల డీలర్ల దుకాణాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. నకిలీ లేబుళ్లు, బ్యాచ్ నంబర్లు లేకుండా విక్రయాలు జరపడం, అనధికారిక, నిషేధిత విత్తనాలను విక్రయించడం వంటి ఏడు వేర్వేరు ఘటనల్లో 18 మంది వ్యక్తులపై ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో రూ.10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, వాటి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు పేర్కొన్నారు. విత్తనాల చట్టం-1966, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ విత్తన ఇన్స్పెక్టర్లు ఇప్పటివరకు 86 విత్తన నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. సబ్సిడీ ఎరువులతో ఇతర రసాయన మందులను లింక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇంద్రవెల్లి మండలంలోని డీలర్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి విక్రయానికి సంబంధించి లాట్ నంబర్, గడువు ముగిసే తేదీ, విత్తన రకం స్పష్టంగా ఉన్న పక్కా బిల్లును రైతులకు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. అలాగే దుకాణాల ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, అందుబాటులో ఉన్న నిల్వలవివరాలతో బోర్డులనుప్రదర్శించాలని సూచించారు. రైతులు కేవలం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలని, తక్కువ ధరల ఆశ చూపే అపరిచితులు, సంచార వాహనాల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. కొనుగోలు చేసిన ప్రతిసారి దుకాణదారుడి సంతకంతో కూడిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని, పంట చేతికి వచ్చే వరకు విత్తన సంచి, ట్యాగ్, బిల్లును భద్రపరచుకోవాలని తెలిపారు. పంట నష్టపోయినప్పుడు పరిహారం పొందేందుకు ఇవే కీలక ఆధారాలని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ కాటన్ (బీటీ-3) విత్తనాల విక్రయం, వినియోగం చట్టరీత్యా నేరమని, రైతులు ధృవీకరించిన బీటీ పత్తి విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 7,35,140 పత్తి విత్తన ప్యాకెట్లు, 3,244 టన్నుల సోయా విత్తనాలు, 210 టన్నుల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. నకిలీ లేదా నిషేధిత విత్తనాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప వ్యవసాయాధికారి, ఏడీఏ కార్యాలయం లేదా జిల్లా వ్యవసాయ అధికారికి 8977742856 నంబర్ ద్వారా సమాచారం అందించాలని రైతులకు పిలుపునిచ్చారు.
Admin
E Nivas News