ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ కేంద్రం లో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య తో కలిసి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026 మార్చ్ నెలలో 10వ తరగతి వార్షిక పరీక్షకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి, 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల సాధన దిశగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, 100 శాతం ఫలితాల సాధనకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులలో పురోగతికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆధునిక యాంత్రికరణ ద్వారా అన్ని రంగాలలో పని సులభతరం అవుతుందని, ఈ క్రమంలో విద్యార్థులు ఏకాగ్రతతో విద్య అభ్యసించి అన్ని రంగాలలో రాణించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రతి సబ్జెక్టు పై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో పట్టు సాధించేలా చదవడం, మాట్లాడటం, రాయడం తప్పనిసరిగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్ణీత గడువులో సిలబస్ పూర్తి చేయాలని, విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో 96.4 శాతం ఫలితాలు సాధించడం జరిగిందని, ఈ విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో సాధించేలా అంకితభావంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హోటల్ కుందన లో మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల బాలికల సంక్షేమ వసతి గృహాల వార్డెన్ లకు నిర్వహించిన 2వ రోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి హాజరయ్యారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి భద్రత, భరోసా అందించాలని తెలిపారు. ప్రభుత్వం విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో బాలికల విద్యకు ప్రాముఖ్యత అందిస్తుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలలో అమలు చేయాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి, ప్రత్యేక అధికారులు బాలికా విద్యపై ప్రదర్శించిన నాటికను అందరు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏ సి జి. ఈ.మల్లేశం, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు భరత్, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా సమన్వయకర్త నవీన జ్యోతి, సహాయ సమన్వయకర్త రమాదేవి, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, మాస్టర్ ట్రైనర్ జ్యోతి, పాల్గొన్నారు.
Admin
E Nivas News