ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సూచించారు. మంథని గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, సైబర్ నేరాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలను సరైన మార్గంలో తీర్చిదిద్దే బాధ్యత కేవలం పోలీసులు, ఉపాధ్యాయులు లేదా వైద్యులదే కాదని, అందులో అత్యంత కీలకమైన పాత్ర తల్లిదండ్రులదేనని అన్నారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, చిన్నప్పటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడాలని,వారి స్నేహితుల వర్గం, మొబైల్ ఫోన్ వినియోగం, సామాజిక మాధ్యమాల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తల్లిదండ్రుల అప్రమత్తత, ప్రేమ, మార్గదర్శకత్వంతోనే పిల్లలను చెడు అలవాట్ల నుంచి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాల అలవాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకే వినియోగించాలని, అధిక వినియోగం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు,ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికీ వెల్లడించవద్దని, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్ఐ ఎన్ సందీప్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News